Home Blog

సాగునీటి రంగం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం సస్యశ్యామలం

సాగునీటి రంగం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం సస్యశ్యామలం:ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రైతులంతా కలిసికట్టుగా ఉండి సాగునీటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో రూ. 37 లక్షల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ లను రైతులందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. లోకేశ్వరం, ముథోల్, బాసర మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లకు తన హాయంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.లోకేశ్వరం మండలంలో హమ్ పథకంలో రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం జరిగిందని, ఏడాది లోపు మండలంలో 60 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రూ.50 కోట్ల నిధులతో అర్లి వంతెన నిర్మాణం చేపడతామన్నారు. ఆర్లి వంతెన విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాల కాలంలో అప్పట్లో పెద్ద మొత్తంలో నిధులు ఉన్న పాలకుల నిర్లక్ష్య మూలంగా రోడ్ల నిర్మాణం జరగలేదన్నారు. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, కాస్త ఓపిక పట్టాలని, రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అయ్యాయన్నారు. అదేవిధంగా 28 ప్యాకేజ్ పూర్తి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని, నిధులు మంజూరు అయితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశల వారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధి కోసం ఐదు గంటల భూమి విరాళం

ఆలయ అభివృద్ధి కోసం ఐదు గంటల భూమి విరాళం

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రేణుకాపూర్ హనుమాన్ ఆలయం అభివృద్ధి కొరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతమ్ స్వచ్ఛందంగా ఐదు గుంటల భూమిని ఆలయానికి విరాళంగా అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయన్ను శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాలను అందజేశారు. ఆలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పనులు జరుగుతాయనీ ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు, భక్తులు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడవొద్దంటూ వామపక్ష పార్టీల రాస్తారోకో

ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడవొద్దంటూ వామపక్ష పార్టీల రాస్తారోకో

వామపక్ష పార్టీల ఆందోళనలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అప్రజాస్వామిక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ రహదారిపై నిర్వహించిన రాస్తారో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ పేరు చిరస్మరణీయమై నిలిచిపోయిందని, ఎవరూ ఆ పేరును చెరపలేరని అన్నారు.అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ నాయకత్వంలో గ్రామీణ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 100 రోజుల ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం కోట్లాది కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకానికి క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తోందని ఆరోపించారు. పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని, ఇది పేదలు, కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగంతో ముందుకు సాగుతోందని విమర్శించారు. లౌకికవాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామీణ కూలీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి

0

 కాంగ్రెస్ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగింది.  జైనథ్ మండల కేంద్రానికి చెందిన ఆయనకు పార్టీ అధిష్టానం పదవిని కట్టబెట్టింది. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం జగదీష్ రెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్ష: రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం

జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్ష: రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:

జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వ్యవసాయ, మరియు రవాణా శాఖల అధికారులతో కలిసి కొనుగోళ్లు, రవాణా అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మార్కెట్ యార్డును పరిశీలించిన అదనపు కలెక్టర్:  ఈ సమావేశానికి ముందే, అదనపు కలెక్టర్ ఆర్‌.ఎస్‌. చిత్రు మార్కెట్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డును క్షేత్రస్థాయిలో సందర్శించారు. యార్డులో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లు, తూకం యంత్రాల పనితీరును ఆయన స్వయంగా తనిఖీ చేశారు. తూకంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం, మార్కెట్ యార్డ్ పరిశీలన కార్యక్రమాల్లో జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదును సవాల్‌గా తీసుకోవాలి: మాజీ మంత్రి జోగు రామన్న 

సభ్యత్వ నమోదును సవాల్‌గా తీసుకోవాలి: మాజీ మంత్రి జోగు రామన్న 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త సవాల్‌గా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, జోగు రామన్న పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు సభ్యత్వ నమోదు, ఓటర్ అవగాహనపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాస రెడ్డి సన్మానం

మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాస రెడ్డి సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తన్వీర్ హైమద్‌లను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయానికి గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కంది శ్రీనివాస రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు

ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు

*ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీసీ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు పాయల్ ఫౌండేషన్ తరఫున స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవలో ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. జాతీయవాదం, దేశభక్తి, క్రమశిక్షణతో కూడిన విలువల విద్యను అందించడంలో ఏబీవీపీ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్, జిల్లా ప్రముఖ్ రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, ఎంఈఓ సోమయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం సాత్నాల మండలం కాన్ప మేడిగూడ రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే అనేక కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జొన్నలు కొనరేమోనన్న ఆత్రుతతో మార్కెట్ యార్డుల్లో రద్దీ నెలకొందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జొన్న పంట కోటా పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపి నాయకులు రమేష్, ఎల్టి అశోక్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

 

 

 

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, బాసర :

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, బాసర :

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో బాసర సీఐ కిరణ్ కుమార్ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై గ్రామస్తులకు, యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ కుమార్,మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకొని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. యువత చదువుతో పాటు ఆయా రంగాల్లో రాణించాలని, మత్తు పానీయాలకు బానిస కాకూడదు అని తెలిపారు.  మైనర్లు వాహనాలు  నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు వాహనదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.